భైంసా పట్టణంలో ఈనెల9న హత్యకు గురైన సయ్యద్ సొహైల్ కేసును పూర్తిగా చేధించినట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. ఇందులో నిందితుడు జుబేర్తోపాటు, సహకరించినవారిని అరెస్టు చేసినట్లు చెప్పారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం వెల్లడించారు.
భైంసా మున్సిపాలిటీలో కాంట్రాక్టు ఎలక్ట్రిషియన్గా చేసే అబ్ధుల్ జుబేర్కు ఇదే పట్టణంలోని ఓవైసీనగర్కు చెందిన పాన్షాప్ నడుపుకునే సయ్యద్ సొహైల్(24)కు మధ్య డబ్బుల విషయంలో ఈనెల 8న మధ్యాహ్నం 2గంటలకు గొడవ జరిగింది. అప్పుడు వారిని ఇబ్రాహ్, ఇత్తేశ్యాం, మోయిన్లు విడిపించారు. ఆ తర్వాత అదేరోజు సాయంత్రం 6గంటలకు ఆర్టీఓ చెక్పోస్టు కెనాల్ వద్ద మళ్లీ జుబేర్, సొహైల్ గొడవపడ్డారు. అప్పుడు వారిద్దరికీ గాయాలయ్యాయి. అదే రోజు రాత్రి ఇబ్రహీం, ఇత్తేశ్యాం మరికొందరు కలిసి సొహైల్ ఇంట్లోనే మళ్లీ వారిద్దరి మధ్య రాజీ కుదిర్చారు. అయినప్పటికీ జుబేర్ పగతో సొహైల్ను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తన సోదరుడు అబ్ధుల్ జమీర్కు చెప్పాడు. వీరిద్దరూ కలిసి తమ బంధుమిత్రులైన అబ్ధుల్ అదిల్, అబ్ధుల్ సొహైల్, మరో మైనర్ బాలుడితో చర్చించారు. వారందరూ సయ్యద్ సొహైల్ను సాయికాటన్ ఏరియాలో చంపడానికి ముందస్తు ప్రణాళిక వేసుకున్నారు. దీని ప్రకారం ఈనెల 9న వారందరూ ఆ ఏరియాకు వెళ్లారు. నిందితుడు జుబేర్ మాత్రం సొహైల్ను అక్కడి తీసుకురావడానికి తన ఇంటికి వెళ్లాడు. ఆ సమయానికి సొహైల్ ఇంట్లో లేడు. తన కోసం జుబేర్ గాలిస్తుండగా, బస్టాండ్ ప్రాంతంలోని మిలన్ హోటల్ వద్ద ఉన్నట్లు గుర్తించి, ఆయనకు మాయమాటలు చెప్పి తన మోటార్సైకిల్( ఏపీ01 ఏసీ9587)పై ఎక్కించుకున్నాడు. ఓవైసీనగర్ వైపు వెళ్లి, చీకటి ప్రదేశంలో ఉన్న సాయికాటన్ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా జుబేర్తోపాటు అక్కడే వేచిఉన్న మిగితా వారందరూ సయ్యద్ సొహైల్పై దాడిచేశారు. ఇదేక్రమంలో అబ్ధుల్జుబేర్ తన వద్ద ఉన్న స్క్రూడ్రైవర్, కత్తితో సొహైల్ను పలుసార్లు పొడిచాడు. అనంతరం అతడిని అక్కడే డ్రైనేజీలో పడేసి పారిపోయారు. అక్కడి నుంచి వెళ్తున్న షోయేబ్, సొహైల్ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలతో డ్రైనేజీలో పడి ఉన్న సొహైల్ను గుర్తించి, ౖభైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సిఫారసు మేరకు మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే సొహైల్ మృతిచెందాడు.
ఈనెల 12న అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. భైంసా సీఐ డి. రాజారెడ్డి, భైంసాటౌన్ ఎస్సైలు ఎండి. షరీఫ్, ఎండీ, గౌస్, కానిస్టేబుళ్లు అంబదాస్, భూషణ్, శైలేష్, గంగాధర్, ప్రమోద్, గజేందర్, ప్రమోద్, బాలాజీ, ప్రవీణ్లు కలిసి నిందితులను అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా విచారించారు. మృతుడి సోదరుడు సయ్యద్ షోయేబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. భైంసా వంటి సున్నితప్రాంతంలో హత్యకేసును తమ పర్యవేక్షణలో త్వరితగతిన చేధించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ జానకీషర్మిల, భైంసా ఏఎస్పీ కాంతిలాల్పాటిల్ అభినందించారు.
నిందితుల వివరాలు..
ఏ–1 : అబ్దుల్ జుబైర్, తండ్రిపేరు అబ్దుల్ మతీన్, వయస్సు–27ఏళ్లు, భైంసా మున్సిపాలిటీలో కాంట్రాక్టు ఎలక్ట్రీషియన్, కొత్తఅబాది, భైంసా.
ఏ–2 : అబ్దుల్ జమీర్, తండ్రిపేరు అబ్దుల్ మతీన్, వయస్సు–27, రేడియం షాప్, కొత్తఅబాది, భైంసా.
ఏ–3 : అబ్దుల్ ఆదిల్, తండ్రిపేరు అబ్దుల్ జబ్బార్, వయస్సు–25ఏళ్లు, ప్లంబర్, కొత్త అబాది, భైంసా.
ఏ–4 : అబ్దుల్ సొహైల్ అలియాస్ ఎస్టీ సొహైల్, తండ్రిపేరు అబ్దుల్ ఖయ్యూమ్, వయస్సు 21ఏళ్లు, వ్యాపారం, ఓవైసీనగర్, భైంసా.
సీసీఎల్(మైనర్) : షహెబాజ్ అహ్మద్, తండ్రిపేరు ఆరిఫ్అహ్మద్, వయస్సు 17ఏళ్లు, లారీ క్లీనర్, కొత్తఅబాది, భైంసా.
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నవి…
1. నిందితుడు జుబేర్ హత్యకు ఉపయోగించిన స్క్రూడ్రైవర్, మోటార్ సైకిల్. మృతుడి మొబైల్ ఫోన్.
2. ఏ–2 నిందితుడి మొబైల్ ఫోన్.
3. Sఏ–3నిందితుడి మొబైల్ ఫోన్, గ్లామర్ బైక్(ఏపీ01ఈఎం1250)
4. ఏ–4 నిందితుడి మొబైల్ఫోన్, పల్సర్బైక్(టీఎస్12ఈఎం1250).
5. హత్యకు ఉపయోగించిన కత్తి.
6. మైనర్ నుంచి నేరం కోసం ఉపయోగించిన మొబైల్ ఫోన్.