బాలబాలికలు చదువుపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో కృషి చేయడం వలన ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని, మన పెద్దలు చెప్పినట్లుగా కష్టం చేసిన వారెన్నడూ చెడిపోరని పోలీసు కళా బృందం సభ్యులు మాటలు, పాటల ద్వారా వివరించారు. మన దేశంలోని యువత స్వయంకృషితో అత్యున్నతస్థాయికి ఎదుగుతున్న విషయం చూస్తూనే ఉన్నామని, అటువంటివారి స్పూర్తితో విద్య వైపుగా మన గ్రామీణ యువత దృష్టి సారించి, తలిదండ్రులకు, పుట్టిన ఊరుకు పేరుప్రతిష్టలు తీసుకురావాలని స్ఫూర్తినిచ్చారు. చిన్న వయసులో ప్రేమ అంటూ చెడు ఆలోచనలు, అలవాట్ల వలన మనమెప్పటికీ ఎదగలేమని, ఒక ఉత్తమమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని పోలీసు కళాబృందం సభ్యులు ఆటపాటల ద్వారా సూచించారు. పిల్లలను ఉత్తమ మార్గం వైపు నడిపించేందుకు తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు సమయం కేటాయించడం, శ్రద్ధ తీసుకోవడం అవసరమని తెలిపారు. బాల్య వివాహాల వలన వ్యక్తిగత అనర్థాలు జరగడమే కాకుండా సమాజానికి తీరని నష్టం వాటిల్లుతోందని, బాల్య వివాహాలు చేసుకోవద్దని, ఎవరైనా అలా చేయాలని ప్రయత్నించినచో చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్-1098 కు ఫోన్ చేయాలని, అలాగే సైబర్ నేరగాళ్ల వలలో పడకూడదని, అనుకోని విధంగా మాయమాటలతో అకౌంట్లో నుండి ఎవరైనా డబ్బులు పోగొట్టుకొన్న యెడల సైబర్ హెల్ప్ లైన్ నంబర్-1930 కి 24 గంటల లోపు కాల్ చేయాలని సూచించారు. యువత సామాజిక మాధ్యమాలు, మొబైల్ ఫోన్లు, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ కష్టించి పని చేయడంలోనే శక్తిసామర్ధ్యాలనూ, గౌరవాన్ని, హోదాను పొందాలని వివరించారు.
అదేవిధంగా… రోడ్డు ప్రమాదాల వలన జరుగుతున్న తీవ్రమైన నష్టాలు, కుటుంబం మొత్తం అంతులేని దుఃఖంలో మునిగిపోతున్న దుర్ఘటనలు మన కండ్ల ముందు ఉన్నాయని, అందుకే చిన్న పిల్లలు(మైనర్ బాలబాలికలు) ఎట్టిపరిస్థితుల్లోనూ ఎలాంటి వాహనాలు నడపవద్దని, పెద్దలు కూడా మద్యం సేవించి, హెల్మెట్ లేకుండా, దురుసుగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వారి కుటుంబాలను రోడ్ల పాలు చేస్తుందని అలాగే మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరు శాస్త్రీయమైన ఆలోచనలను పెంపొందించుకోవాలని సూచించారు. మూఢనమ్మకాల వలన జరుగుతున్న నైతిక, ఆర్థిక, ప్రాణ నష్టాలను నివారించుటకు ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని పోలీసు కళా బృందం సభ్యులు పాటలతో, ఎస్.ఐ. మాటలతో వివరించారు.
మన జిల్లా ప్రజలు ముఖ్యంగా యువత, బాలబాలికలు గొప్పగా ఎదగాలన్న జిల్లా ఎస్.పి. శ్రీ హర్షవర్ధన్ గారి సందేశాన్ని సురక్ష పోలీసు కళాబృందం సభ్యులు తెలియజేశారు.
కార్యక్రమంలో సి.సి.కుంట పోలీసు స్టేషన్ నుండి ఎస్.ఐ. శేఖర్ తో పాటు పోలీసు సిబ్బంది, అప్పంపల్లి గ్రామ పెద్దలతో పాటు గ్రామ మహిళలు, యువత మరియు పిల్లలు పాల్గొన్నారు.